ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, అక్టోబర్ 2020, శుక్రవారం

తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం


మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.

గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే కేరళ లోని దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.

అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు.

ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది.

గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.

నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాలం పోయినా, గొడ్డలితో తాలాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.

కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”.

కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .

గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.

సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది!

31, జులై 2017, సోమవారం

శబరిమల అందాలను 360 డిగ్రీ లో వీక్షణం




Sabarimala a 360 degree panoramic view. You can touch and move. All important places are listed. Amazing technology. Nicely created....Swamiye Saranam Ayyapa.

https://www.p4panorama.com/panos/sabarimala/

For those who have not been to sabarmala , this would b a great opportunity to view the place...👍👍👍thanks to technology

29, జులై 2017, శనివారం

వెలుగును విస్తరింపజేయండి. చీకటి జాడల్ని ఎంచనవసరం లేదు.



ఒక జాలరి చెరువులో గాలంవేసి చేపల్ని పడుతున్నాడు. అది చూసిన ఒకాయన “ఏం చేస్తున్నావు?” అని అడిగితే, ‘నీటిలో మునిగిపోయిన చేపల్ని ఒడ్డున పడేస్తున్నాను – కరుణతో – అని సమాధానమిచ్చాడు జాలరి. మతమార్పిడి చేస్తున్న పెద్దమనుషులు ఈ జాలరులవంటి వారే” – ఈ మాటలు స్వామీ దయానందసరస్వతీ మహోదయులు వక్కాణించినవి. ఎంత అద్భుతంగా వాస్తవాన్ని వర్ణించారు!
ప్రేమ, సేవ తమ స్వభావాలన్నట్లుగా మాట్లాడుతూ, వంచనతో హిందూ చేపల్ని సనాతన దర్పము చెరువునుండి బయట పడేస్తున్న విదేశీ మతోద్యోగుల వ్యాపారుల వంచనాశిల్పమిది.
వారు దయను అభినయిస్తూ మాట్లాడవచ్చుగాక. కానీ చేపలు మాత్రం – “ఆహా! వీడెంత దయామయుడు! నీటిలో మునిగిపోయిన నా బ్రతుకును ఒడ్డున పెడుతున్నాడు. బయటనున్న విశాల ప్రపంచాన్ని చూపించాడు. చెరువే ప్రపంచమనుకుని ఇన్నాళ్ళూ భ్రమతో ఉన్నాను” అని మురిసిపోతే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. మతం మారిపోతున్న వారంతా అటువంటి మూర్ఖమీనాలేననడం సందేహం లేదు.
గమనిక: ఈ సందర్భంలో వ్రాస్తున్న మాటలన్నీ ఇతరమతాలని ఎత్తిచూపడమో, కించపరచడమో కాదు. అందరినీ గౌరవిస్తూ ఎవరి ధర్మంలో వారు బ్రతకాలి అని చెప్పడమే ఉద్దేశం. అన్ని మతాలపైన సహన, సోదరభావం సహజంగా కలిగిన హిందువుగా ముందే ఒక విన్నపం చేసుకొని విషయాలను స్పష్టం చేసుకుందాం.
ప్రేమలు, సేవలు, రక్షణలు, స్వస్థతలు, సువార్తలు, కూటములు ఇవన్నీ విష కుంభాలపై జల్లిన అమృతపు చినుకుల పొంగులేననీ కాస్త వివేకమున్న వాడెవడైనా ఒపుకుని తీరవలసిందే!
పరాయిదేశాల నుంచీ వచ్చే మతవ్యాపారుల మోచేతి నీటి తీర్థప్రాశన చేస్తున్న పాపాత్ములు, తమ ధనాశను తీర్చుకోవడానికై చేస్తున్న వ్యాపారమిది. ‘ధర్మం’ పేరుతో వ్యాపారాలు చేయడం వారి నైజం!
‘అది మతమూ కాదు, ధర్మమూ కాదు. అది కేవలం వాణిజ్యం(commerce) అని ఏనాడో అనీబిసెంట్ అన్న మాటని విస్మరించరాదు. హింస, విధ్వంసాలు పునాదులుగా విస్మరిస్తూ వ్యాపారంగా, పాలనగా తామే ప్రపంచాన్ని ఏలాలనే విషకాంక్షతో, వ్యూహాత్మకంగా పరిశ్రమలను నడిపేటంత యాజమాన్య శిక్షణలతో మన అవినీతి నాయకుల అండదండలతో పెచ్చరిల్లుతున్న పైశాచిక కాండయే ఈ మతమార్పిడుల మారణోద్యమం! ఇది దాచేస్తే దాగని సత్యం!
ఇలాంటి నేపథ్యంలో ఆ విదేశీమత వాణిజ్యసంస్థలు విసిరే నోట్ల కట్టలకోసం – మానవతా ధర్మానికి విరుద్ధంగా ఒక కులాన్నో ఒక మతాన్నో తరచూ అవమానిస్తూ, లోపభూయిష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్న మీడియా దారుణ కృత్యాలు ఊపందుకుంటున్నాయి.
పనికట్టుకొని హిందూ శ్రద్ధాకేంద్రాలలో లోపాలను ఎత్తిచూపడమో. హిందూ వ్యవస్థలోని ఏ జాతి వివక్షనో లేవదీసి చర్చావేదికలు పెట్టడమో చేసి వినోదిస్తున్నారు. దీనిద్వారా హిందూమతాన్ని సంస్కరించుదామనే మహోద్దేశాలేమీ లేవు. కేవలం తమకు హిందూ ద్వంసకాండ ద్వారా, పరాయి వారి నుండి లభించే దానాల కోసం చేసే ప్రాజెక్ట్ లు మాత్రమే ఇవి.
“హిందూమతం కొన్నాళ్ళకి తగ్గిపోతుంది’ అని కొందరిచే అనిపించి, దానిని ఖండించే అమాయకుల్ని కూర్చోబెట్టి అరిపించి ఒకసారి వినోదిస్తే...’హైందవుల అంతర్మథనం’ అంటూ చర్చ లేవదీసి, హిందువులలో లోపాలవల్లనే మతమార్పిడులు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తూ వాటికి సమాధానాలిమ్మని పదిమందిని అడిగి, వారిని సంపూర్ణంగా మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటూ వికృతకేళిని మరోసారి నిర్వహిస్తారు.
ఇవి కొన్ని ‘ఛా’నల్స్ కు ఆనవాయితీ. ఈ కైంకర్యం వలన వారికి మతాంతరీకరణ సంస్థలనుంచి పెద్ద మొత్టాలే ముడతాయి. కానీ వారు చూపిస్తున్న లోపాలు, ఆరోపణలు నిజానికి చెప్పుకోదగ్గవి కావు. లోపమూ, ఆరోపణా లేని మతమూ, సిద్ధాంతమూ, వ్యవస్థా ఏదీ ఈ భూమి మీద లేదు.
హిందువుల్లో కొన్ని ముఖ్య లోపాలున్నాయి. అవి మూడే మూడు. ఇంతకుమించి మరేమీ లేవు అని సవినయంగా మనవి చేసుకుందాం.
ఒకటి: అన్ని మతాలూ ఒకే సత్యం వైపు నడిపించే దారులు...అని తాత్త్వికంగా  మాట్లాడి, అందర్నీ అక్కున చేర్చుకోవడం. ఇదే తాత్త్విక దృష్టి అవతలి వాడికి లేదని తెలుసుకోలేకపోవడం.
రెండవది: దీనిని అలుసుగా తీసుకుని ప్రవేశించి మనల్ని నిందిస్తూ అవతలివారు రెచ్చిపోతుంటే, చూస్తూ సహిస్తూ, ‘నిజమే-మాలో లోపాలున్నాయేమో!’ అని భ్రమించి విస్తుపోవడం.
మూడవది: ఏ మతాన్ని ఎత్తిచూపినా అది మానవతావాదానికి విరుద్ధమనీ, ‘ఒకరి మనోభావాలను దెబ్బతీయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా మాధ్యమరంగానికి లేదా?’ అని ప్రశ్నించలేకపోతున్నాం.
“నీ చానల్ వీక్షకుల్లో హిందువులు లేరా? వారి మనసు గాయపడదా?’ అని అడగలేని చవటాయితనం పెద్దలోపం. – ఈ మూడు లోపాలు తప్ప మరేమీ లేవు. మిగిలినవి వాళ్ళు చిత్రించి చూపిస్తున్నవే గానీ లోపాలు కావు.
‘ఒక సిద్ధాంతంలోని లోటుపాట్లు చర్చించాలంటే దానిలో ప్రావీణ్యం ఉండాలి. అధ్యయనం ఉండాలి. కనిపిస్తున్న వ్యవహారాలు చాలవు. యుగాలనుండి వర్ధిల్లిన విస్తారమైన హిందూధర్మం వీరికి అర్థమౌతుందా?
చెట్టులో, పుట్టలో, రాతిలో, పసుపుముద్దలో, విగ్రహంలో, యంత్రంలో, మంత్రంలో, యజ్ఞాగ్నిలో, దీపకళికలో, సూర్యచంద్రులలో, నదీజలాలలో, పర్వతాలలో పరమాత్మను భావించి ఆరాధించే ఉదాత్త దర్శనశక్తి వీళ్ళకి అవగాహన అవుతుందా?
ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ప్రార్థించడం దగ్గరనుంచి, అన్ని సుఖాలను త్యాగం చేసి, పరమ వైరాగ్యంతో ఆత్మతత్త్వాన్ని  ఆవిష్కరించుకొని, తరించే తత్త్వజ్ఞాన సంపత్తి కలిగిన ఒకే ఒక ధర్మం – హైందవమేనని వారికి తెలుసా? వ్యాస వాల్మీకి అగస్త్య వసిష్ఠాది మహర్షుల తపఃఫలం, ఆదిశంకర, రామానుజాచార్య, మధ్వాచార్య వంటి మహాతత్త్వవేత్తల దర్శనశక్తి, రామకృష్ణపరమహంస, స్వామీ వివేకానంద, స్వామీ రామతీర్థ, పరమహంస యోగానంద వంటి మహనీయుల జ్ఞానవైభవం, రమణమహర్షి, కావ్యకంఠ గణపతి ముని, స్వామి రామా వంటి మహాయోగుల తత్త్వదీప్తి, వీటి ప్రభావంగా ఎందఱో విదేశీ మేధావులు హిందూ ధర్మ సాధనలను ఆచరించి, జ్ఞానసిద్ధిని పొందిన ఘట్టాలు...వీటి గురించి ఎప్పుడైనా పరిశీలించారా!
రంగులు లేని కళ్ళద్దాలతో, వీరి విజ్ఞానాల్లో కొన్ని పుటలైనా అధ్యయనం చేశారా? కొద్ది వేల ఏళ్ళ చరిత్ర, ఒక్క పుస్తకం, ఒక్క ప్రవక్త బోధ మాత్రమే కలిగిన పరిమిత జ్ఞానాన్ని పట్టుకొని, హింస, విధ్వంసాలతో ఎన్నో దేశాల నాగరికతలను నాశనం చేసి, ఆక్రమించుకున్న అల్పకాల మతాలను వెనకేసుకు వచ్చి అనాది యుగాల నాటి దేశీయ దివ్య విజ్ఞానాన్ని విచక్షణారహితంగా ఎద్దేవా చేయడానికి, ఒక్క మీడియా ఉందన్న అహంకారం అర్హతగా సరిపోతుందా?
ఇతరమతగ్రంథాలు, ప్రవక్తలు తక్కువ వారు అనే పాపానికి మేము ఒడిగట్టడం కాదు కానీ ఒక్క సత్యం మాత్రం విస్మరించవద్దు అని వినతి చేసుకుంటున్నాం. ఏ ప్రవక్తలకో తీసిపోని, ఇంకా మాట్లాడితే మించిపోయిన యోగులు, మహర్షులు, మహాత్ములు, సిద్ధపురుషులు, మునులు, తపస్వులు, జ్ఞానులు వేల సంఖ్యలో కలిగిన ఒక మహాసుధాసముద్రం సనాతన ధర్మం. దీనిలో ఒక కెరటం పాటి ఉండవు ఇతర ధర్మాలు. ఆ మిడిసిపాటుతనంతో ఆక్రమణలు చేసుకున్న మతాలకు అంతర్మథనాలు, ఆత్మ పరిశీలనలు అవసరం!
అలాంటి అంతర్మథన కార్యక్రమాలను మీడియాలకి పెట్టగలిగే దమ్ముందా?
చరిత్రలో ఇప్పటికి ఎన్ని దేశాల్లో మతవిస్తరణ కోసం మాన, ప్రాణభంగాలు చేశారు? ఎన్ని అద్భుతమైన నిర్మాణాలు ధ్వంసం చేశారు? చేస్తున్నారు? మీ మతదేశాల్లో ఇతరులకి స్వేచ్ఛా వాయువులున్నాయా?
మీరు ధ్వంసం చేసిన ఆలయాలను మళ్ళీ పునర్నిర్మించగలరా? ఉగ్రవాదమో, తీవ్రవాదమో, వేర్పాటువాదమో, కరడుగట్టిన మతఛాందసమో తప్ప ఒక్క యోగ విజ్ఞానాన్నీ గానీ, తత్త్వజ్ఞానాన్ని గానీ, త్యాగశీలురను గానీ, ఉదారవాదులను గానీ మీ సిద్ధాంతం ఎందుకు తయారుచేయలేదు? ఉగ్రవాద శిక్షణలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? డబ్బులకోసం మతం మారడం తగునా? మీ మతంలో ఏమి అధ్యయ్యనం చేసి మారుతున్నారు? అని ప్రశ్నించగలరా?
అన్యమతస్థులకు సమానావకాశాలు కల్పించి, ఉన్నత పదవులను పాలనాధికారాలను, గౌరవాలను, ప్రశంసలను అందించగల ఒకే ఒక్క ధన్య దేశం భారతమేనని సగర్వంగా చాటవలసిన ఉన్నత స్థితిలో ఉన్న మనకు ఆత్మన్యూనతను కల్పించడం తగునా?
ఒక దుర్మార్గుడు ఒక అమాయకుడిని చితకబాడి దోచుకున్నాడు. ఇతగాడు రోదిస్తూ ఉంటే వచ్చి “నీలో బలహీనత వల్లే వాడు కొట్టాడు. ణీ లోపాలు తెలుసుకో దిద్దుకో” అని ఉపన్యాసమిచ్చినట్లు, మన లోపాలు ఏమిటో వెతుకుతున్నారు. ద్రోహబుద్ధితో వంచనతో తిరుగుతున్న దుర్మార్గాన్ని సమర్థిస్తున్నారు. మీ అంతరాత్మను సూటిగా ప్రశ్నించండి.
మీరిప్పుడు హిందూమతంపై ప్రశ్నలు కొత్తవేమీ కావు. వీటన్నిటికీ మాడు పగిలేలా సూటి సమాధానాలు వందల ఏళ్ళనుండి వివేకానంద వంటి మహాత్ములు ఇస్తూనే ఉన్నారు.
ధర్మంలో పూర్ణత ఉన్నా, వ్యక్తుల స్వార్థాల వల్ల, ఇతరుల దాడుల వల్ల, అన్యం పట్ల వ్యామోహం వల్ల రాజకీయ దుర్మార్గం వల్ల ఏర్పడ్డ ఛిద్రాలను అవకాశాలుగా తీసుకుని ధర్మనింద చేయడం తగునా?
అగ్రవర్ణాలకు చెందని ఎందఱో యోగులు, జ్ఞానులు, అవధూతలు ఈ దేశంలో ఏనాటినుండో గౌరవింపబడుతున్నారు. హిందువు ఎప్పుడూ గర్వించదగ్గ స్థాయిలోనే ఉన్నాడు. విదేశీమతపెద్దల పెట్టుబడులతో, వారిచేత పెట్టబడిన బుర్రలున్న పాలకులతో అలరారుతున్న మాధ్యమరంగం దృష్టిలో హిందూత్వం వెలవెలపోతోంది. కానీ వాస్తవ దృష్టితో చూస్తే హిందూ వైభవం జగద్వ్యాప్తమౌతోంది.
ఎందఱో బడుగువర్గాల వారు దీక్షగా అయ్యప్పను సేవిస్తున్నారు. భవానీ మాలలను ధరిస్తున్నారు. ఆపదమొక్కుల వానికి అడుగడుగు దండాలు పెడుతున్నారు. వారిని ఆ ఆలయాలు ఆహ్వానిస్తున్నాయి. ఉత్తరాది క్షేత్రాల్లో కూడా జ్యోతిర్లింగాలు అతిసామాన్యుని చేత అభిషేకించుకుంటున్నాయి. తొక్కిసలాటలతో, బారులతో తిరునాళ్ళు, కుంభమేళాలు, పుష్కరాలు జరుగుతున్నాయి. మేధావులారా! ఒక్క విచక్షణని సాధించే ప్రయత్నం చేయండి.
సృష్టిలో అన్ని ధర్మాలకు వేటి స్వభావం వాటికుంటుంది. వైద్యవిధానాల్లో వంద రకాలున్నాయి. మతాలూ అలాగే ఉంటాయి, ఉండాలి. ఆయుర్వేదంలో అనుపానానికీ, పథ్యానికీ ప్రాధాన్యం. ఆధునిక వైద్యంలో వాటి అవసరం లేదు. అంతేగానీ పథ్యానుపానాలు లేని ఆధునికమే మంచిదని గానీ, అవి కలిగిన ఆయుర్వేదమే శ్రేష్ఠమని గానీ సిద్ధాంతం చేయడానికి వీలులేదు. సాఫల్య వైఫల్యాలు రెండింటిలోనూ ఉంటాయి. అవి వైద్య శాస్త్రం లోపాలు అనలేము. వైద్యుల పొరపాటో, రోగుల గ్రహపాటో అని సర్డుకుపోతున్నాం. అవే మతాలకు వర్తిస్తాయి. దేని ప్రత్యేకత దానిదే. ఏ విద్యావిధానాన్ని అనుసరించే రోగి దాని పధ్ధతిలోనే చికిత్స పొందాలి. అంతే.
వీలయితే అధ్యయనం చేయండి. మంచిని బోధించండి. అందరినీ కలసిమెలసి ఆనందంగా బ్రతకనివ్వండి. కించపరచడాలు, ఎత్తిచూపడాలతో మీరు సాధించేదేమిటి?  హిందూ మత నిర్మూలనమా? అది మీవల్ల కాదు.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించుకుంటూ, సంస్కరించుకుంటూ ఎదుగుతున్న ‘డైనమిజం’ హైందవంలో ఉంది.
చివరిగా ఒక మాట- వాస్తవాలను చర్చించడమే ఇందులో ఉద్దేశం. ఒక ఆర్తినీ, సత్యఘోషనీ వెలువరించడమే ఆంతర్యం. అంతేగానీ ఏ ధర్మాన్నీ కించపరచే భావం ఈషణ్మాత్రం కూడా లేదని సవినయంగా మనవి. యుగాల క్రితమే, సృష్టిస్థితిలయకారకమైన మహా చైతన్యం గురించి అన్నిరకాల భావనలను ఆవిష్కరించి, ఎవరి సంస్కారానికి తగినట్లుగా వారు తరించడానికి రాచమార్గాలు వేసిన విశాల సనాతన ధర్మానికి చెందినా ఏ ఒక్కరూ అన్ని మతమార్గాలను గౌరవించే విజ్ఞతతోనే ఉంటారు. సమాజంలోని లోపాలను, వ్యక్తుల అవినీతినీ ధర్మానికి అంటగట్టవద్దు.
క్షుద్రప్రయోజనాల కోసం కాకుండా సామరస్య జీవన సరళితో కూడిన సమాజ నిర్మాణానికి శక్తిమంతమైన మాధ్యమరంగం కృషి చేయాలి. అన్నిటిలోని మంచిని మాత్రమే వ్యాప్తి చేస్తే, చెడు దానంతటదే తొలగిపోతుంది. వెలుగును విస్తరింపజేయండి. చీకటి జాడల్ని ఎంచనవసరం లేదు.
ముస్లిం, క్రైస్తవ సోదరులు కూడా ఈ దిశగా సామరస్య భావనను అవలంబించలి --   సామవేదం షణ్ముఖ శర్మ  గారి ప్రవచనం నుండి

23, సెప్టెంబర్ 2013, సోమవారం

శ్రీ రాముడు



రావణ లంక దొరికింది అనునది పుక్కిటి పురాణం కాదు ..నిజంగా జరిగినది అనే సాక్షాలు ఇవిగో .. ప్రతివొక్క హిందువుకు చేరేల షేర్ చెయ్యండి..!

సీతను దాచిపెట్టిన లంక దొరికింది. ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. ఒక మహా అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..
ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం… వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం… ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం… సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం.
లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం..ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు.
ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది.
ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా?
శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్… ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్ పారమల్ ఫార్మాస్యూటికల్స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి.
విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్గా కనిపిస్తుంది…
రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా.
మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు… రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..
శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు… గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది.
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది.
మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్ రామచరిత మానస్లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..
తులసీదాస్ రాసిన రామచరితమానస్ ఒరిజినల్ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది.
కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది…
ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరకడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ.
శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.
రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారు .. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కాలమే సమాధానం.
రావణుడు.. రామాయణం… భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి.లంకలో రావణ రహస్యం గురించి మరి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం.
మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు.. ఈ తరానికి తెలిసిందల్లా, ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే…ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం.. వాల్మీకి రాసింది ఒక రామాయణం.. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి.. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారం అవుతోంది.
రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్ వేరేలా ఉంది.. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట..పంచవటిలో, పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్ తోటలోని తన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య మండోదరి దేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.
లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్ మండోదరికి ఉండేదిట..చుట్టూ జలపాతాలు.. పూల తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత అశోకవాటికకు తరలించాడు.. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు.
అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్ అనే చిన్న ప్రాంతం ఉంది.. చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న వృక్షాల మధ్య ౨౦౦ గజాల మేరకు ఉన్న చిన్న స్థలం.. అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట.. సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా డ్రె అయిపోయింది.. అప్పటి నుంచి ఇలాగే ఉంది.
ఇస్త్రిపుర . అంటే ఏరియా ఆఫ్ వుమెన్ అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట. ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిప్ట్ చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది…
ఈ ప్రాంతాన్ని దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది.. దీంతో పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది.. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే… ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని కూడా నిర్మించారు..
లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే సమయంలో రామాయణంలో రావణుడి సంబంధించినంత వరకు మిగతా కేరెక్టర్లు కొన్ని ఉన్నాయి..వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి…
లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం…ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది..అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు..
రావణుడి కొడుకు ఇంద్రజిత్.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు.. ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికీ పూజలందుకుంటున్నాయి.
రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది.. శ్రీలంకలోని తిరుక్కోవిల్లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది..ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట.. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం.
తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీఫారమ్.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు.. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్ హౌస్ కనిపిస్తుంది.
ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్ బోడా అంటారు.. అక్కడ చిన్మయ మిషన్ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు..
రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు..లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్ను కనుక్కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ.
రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని చెప్పుకున్నాం.. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది.. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనికి సింహళభాషలో గుర్లపోత అంటారు..అంటే పక్షి వాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే ఎగిరే నెమలి అని అర్థం.
రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు.. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట.
లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్ కలిపే నెట్వర్క్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది.. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా కిటికీలు ఉన్నాయి,
ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత.. భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు..
పధ్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలు దేరిన రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు.. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది.. దండకారణ్యంలో రావణుడి గవర్నర్ ఖరుడు పరిపాలన సాగించాడు.. రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు..
పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.. భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలైమన్నార్ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది.. ఇదేం విచిత్రం కాదు.. నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్లోని రామప్ప దేవాలయ గోపురంలోనూ మనం చూడవచ్చు.. లైట్వెయిట్ స్టోన్స్, నీరు, ఇసుక.. పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.. రామ సేతువు ఇవాళ్టికీ సుమారు ౩౦ కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది.
శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్ దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది..
నీలవరై పుత్తుర్ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్ రాక్ అని అర్థం.. ఈ పర్వత పై భాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది.. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో తలైమన్నార్ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు అదేనండీ ఇవాళ మనం అనే మెడిటేషన్ చేసేవాడు..
ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా మారిపోయింది.. రాముడు వనవాసానికి వెళ్లేనాటికా ఆయన వయసు ౨౫ సంవత్సరాలు.. రావణున్ని హతమార్చేప్పటికి రాముడు ౩౯ ఏళ్ల వాడు.
రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని ప్రాంతాలలో ఆగాడు.. సేద తీరాడు.. పరమేశ్వరుని కొలిచాడు.
రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు.
వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది.. రావణుడు బ్రాహ్మణుడు.. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరాడు.. అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రాముడికి సూచించాడట.. దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.. దీన్ని రామలింగ శివుడని కొలుస్తారు.. ఆ తరువాత తిరుకోణేశ్వరంలో, అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు… చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు..
పుష్పకంపై తిరిగి వెళ్తూ, రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లాడని కూడా కథనం చెప్తారు.. మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది..
రామాయణం- ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు
:::::::::::::::::::::::::::::::::::::

  1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్
  2. కపిల మహర్షి ఆశ్రమం, (శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) – గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
  3. కాంభోజ రాజ్యం – ఇరాన్ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
  4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
  5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు – గోకర్ణ, కర్ణాటక
  6. సీతాదేవి భూమిలో లభించిన చోటు – సీతామర్హి, బీహార్
  7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – జనక్ పూర్, నేపాల్.
  8. కోసలదేశం – రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం.
  9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్, ఉత్తర్ ప్రదేశ్.
  10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – ఘాఘర నది.
  11. అయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం, బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం, సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) – అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్.
  12. తాటక వధ జరిగిన ప్రదేశం – బక్సర్, బీహార్
  13. అహల్య శాపవిమోచన స్థలం – అహిరౌలి, బీహార్
  14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) – సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
  15. గుహుడు సీతారామ లక్ష్మణులను కలిసిన చోటు – శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
  16. దండకారణ్యం – చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాలు.
  17. చిత్రకూటం (సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన చోటు) – సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
  18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) – నాసిక్, మహరాష్ట్ర.
  19. కబంధాశ్రమం – కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
  20. శబరి ఆశ్రమం – సర్బన్, బెల్గావి, కర్ణాటక.
  21. హనుమంతుడు రామ లక్ష్మణులను మొదటిసారిగా కలసిన ప్రదేశం – హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
  22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక.
  23. విభీషణుడు రాముణ్ణి శరణు కోరిన స్థలం – ధనుష్కోటి, తమిళనాడు.
  24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం, తమిళనాడు
  25. రత్నద్వీపం / సింహళం / లంక – శ్రీలంక.
  26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) – కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక.
  27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు – దునువిల్ల, శ్రీలంక.
  28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం – దివిరుంపోల, శ్రీలంక.
  29. వాల్మీకి ఆశ్రమం/ కుశ లవుల జన్మ స్థలం / సీతాదేవి భూదేవిలో ఐక్యమైన స్థలం – ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
  30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్.
  31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్
  32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడు భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్
  33. పుష్కలావతి/ పురుష పురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) – పెషావర్, పాకిస్తాన్.